రాడ్‌లతో తలపై కొట్టి... మర్మాంగాన్ని కోసేసి - రౌడీషీటర్‌ దారుణ హత్య

శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (10:59 IST)
విశాఖపట్టణం జిల్లాలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. రాడ్‌లతో తలపై కొట్టి, మర్మాంగాన్ని కోసేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని రామ్మూర్తి పంతులపేట వద్ద పైడిమాంబ ఆలయం సమీపంలో కొబ్బరితోట ప్రాంతానికి చెందిన గనగళ్ల శ్రీను(45) చిన్న చిన్న దొంగతనాలు, ఇనుప తుక్కు దొంగిలించడం వంటి కేసుల్లో గతంలో అరెస్టయి రిమాండ్‌కు వెళ్లాడు. 
 
టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైన ఇతనిపై నగరంలోని వివిధ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. 13 ఏళ్ల క్రితం భార్యతో గొడవపడి వేరేగా ఉంటున్నాడు. ఇనుప చెత్త ఏరి పైడిమాంబ ఆలయం సమీపంలోని దుకాణంలో అమ్మి, ఆ డబ్బులతో నిత్యం మద్యం తాగుతూ అక్కడే తిరుగుతుంటాడు. 
 
బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆ దుకాణం వద్దే గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడిచేసి హత్యచేసి పరారయ్యారు. సంఘటన స్థలంలో ఓ చిన్న కత్తి, రక్తచారలతో ఉన్న ఓ కర్ర, ఓ రాయి ఉన్నాయి. అక్కడ మూడు ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయి. దీన్నిబట్టి గనగళ్ల శ్రీను మరో ఇద్దరితో మద్యం తాగి ఉంటాడని, ఆ తర్వాత వారు అతన్ని హత్యచేసి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
గురువారం ఉదయం స్థానికులు శ్రీను అన్నయ్య కుమారుడు ధనరాజ్‌కు చెప్పడంతో అతను కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పాతకక్షలు, లేదా వివాహేతర సంబంధం నేపథ్యంలోనైనా హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని కంచరపాలెం సీఐ కృష్ణారావు సందర్శించి పరిశీలించారు. క్లూస్‌ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. కొంతమంది అనుమానితులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు