స్ట్రీమింగ్ యాప్ ద్వారా తెలుగు చిత్రాలు రిలీజ్?

బుధవారం, 1 ఏప్రియల్ 2020 (08:53 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేసింది. ఈ వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలే సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించాయి. పైగా, ఈ వైరస్ ప్రభావం ఎపుడు తగ్గుతుందో తెలియదు. పైగా, లాక్‌డౌన్ కూడా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి అపారనష్టం వాటిల్లింది. ముఖ్యంగా, మార్చి నెలలో విడుదల కావాల్సిన అనేక చిత్రాలు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ భయంతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేయడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 
 
అయితే, ఇపుడు ఏప్రిల్ నెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా ఇది కొనసాగవచ్చనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈ నెలాఖరు వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర నిర్మాతలు సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో బొమ్మ పడే సూచనలు లేనికారణంగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదలకావాల్సిన చిత్రాలను థియేటర్స్‌లో కాకుండా, స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కరోనా కారణంగా లాక్ అయిన పరిస్థితులు మళ్లీ ఎప్పుడు యథా స్థితికి వస్తాయో అని ఆలోచిస్తున్న వారంతా ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా చేయనున్నారని టాలీవుడ్‌లో వినిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు