చిరంజీవి చిత్రంలో కండల వీరుడు... 'లూసీఫర్' రీమేక్‌లో...

ఆదివారం, 3 మే 2020 (13:27 IST)
మెగాస్టార్ చిరంజీవి వెండితెర రీ ఎంట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత ఆయన వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. అలాగే, ఆయన కాల్షీట్ల కోసం నిర్మాతలు, దర్శకులు క్యూకడుతున్నారు. ఈపరిస్థితుల్లో ప్రస్తుతం చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. పరస్థితులన్నీ చక్కబడిన ర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. 
 
అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో చిరంజీవి చేయబోయే చిత్రాల గురించి స్వయంగా మెగాస్టారే క్లారిటీ ఇచ్చి ఉన్నారు. ఆచార్య చిత్రం తర్వాత 'లూసీఫర్' రీమేక్‌లో చేస్తున్నానని, దానికి 'సాహో' దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తాడని తెలిపారు. ప్రస్తుతం సుజీత్ ఈ చిత్రాన్ని తెలుగు నెటీవిటీకి అనుగుణంగా మారుస్తున్నారని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అలాగే, మరికొందరు యువ దర్శకుల కాంబినేషన్‌లో కూడా ఆయన నటించనున్నారు. 
 
అయితే, లూసీఫర్ చిత్రంపై తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలకపాత్రను చేయబోతున్నారట. 'లూసీఫర్' చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ ఆ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించారు. మోహన్‌లాల్‌కు సపోర్ట్‌గా ఉండే ఆ పాత్ర సినిమాకి ఎంతో ముఖ్యమైనది. ఆ పాత్రలో సల్మాన్ ఖాన్‌ని నటింపజేయాలని చూస్తున్నారట. 
 
ఎందుకంటే చిరంజీవి వెండితెర రీ ఎంట్రీ చిత్రం "ఖైదీ నంబర్ 150"లో వెంకటేష్, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయాలని అనుకున్నారట. కానీ ఆ విషయం మూవీ రిలీజ్ తర్వాత చిరంజీవికి తెలియడంతో ఎంతో ఫీల్ అయ్యారట. అందుకే ఈ చిత్రంలో సల్మాన్‌ని నటింపజేయాలని చిరంజీవి కూడా కోరారని అంటున్నారు. నిజానికి ఆ పాత్రలో సల్మాన్ కూడా చక్కగా సరిపోతారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే మరోమారు మెగాస్టార్ ట్విట్టర్ పిట్ట కూత పెట్టాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు