మహానటి సావిత్రి జీవిత చరిత్ర ప్రాతిపదికన స్వప్న సినిమాస్ నిర్మించనున్న మహానటి సినిమాలో సమంత పాత్ర హీరోయిన్ పాత్ర కాదని స్పష్టమైపోయింది. సావిత్రిగా ముఖ్యపాత్రలో కీర్తి సురేష్ నటించనున్న విషయం ముందే తెలిసిందే. కానీ ఈ సినిమాకోసం సైన్ చేసిన సమంత కథను ముందుకు నడిపించే విలేకరి పాత్రలో కనిపించనున్నారని వార్తలు.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఆసక్తి కలిగించిన నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న మహానటి సినిమాలో సమంత లుక్ను ప్రత్యేకంగా డిజైన్ చేసారని తెలుస్తోంది. 1980లలో విలేకరులను స్ఫూర్తిగా తీసుకుని సమంత లుక్ని రూపొందించారట. ‘‘సావిత్రి గురించి తెలుసుకోవాలని పట్టు వదలకుండా రీసెర్చ్ చేసే జర్నలిస్ట్గా సమంత కనిపిస్తారు. సినిమాలోని కథ కూడా ఈ జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సావిత్రి చరిత్రను విలేకరి వివరిస్తారు’’ అని చిత్ర యూనిట్ వర్గాలు వివరిస్తున్నాయి. వైజయంతి మూవీస్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీత దర్శకుడు.
ఏ సినిమాలో అయినా తన ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించుకోని సమంత కథను నడిపే పాత్రను చేపట్టడం విశేషం. సమంత ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్లు వీడు తిప్పేవాడా లేక తిరిగేవాడా అనేది ఆమెవిషయంలో మనం ఆపాదించుకోవాలేమో. సమంత ఈ సినిమాలో తిరిగేదా, లేక తిప్పేదా..? చిత్రం పూర్తయితే కానీ దీనికి సమాధానం తెలియదు కామోసు.