దసరాకు వస్తానంటున్న 'ఆచార్య' - చిరు సరసన సోనాక్షి

బుధవారం, 23 జూన్ 2021 (19:15 IST)
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది., ఓ సింగిల్ షెడ్యూల్లో షూటింగు పార్టును పూర్తిచేయాలని చూస్తున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు. 
 
జులై మొదటివారంలో ఈ షెడ్యూల్‌ను మొదలుపెట్టి, 20 రోజుల్లో చిత్రీకరణను పూర్తిచేస్తారట. ఈ షెడ్యూల్లో చిరంజీవి.. చరణ్ తదితరులు పాల్గొంటారని అంటున్నారు. ఆగస్టులో మిగతా కార్యక్రమాలను పూర్తిచేసి, దసరాకి విడుదల చేయలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ అలరించనుంది. అలాగే చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. 'సైరా' తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. 
 
ఇక కొరటాల మార్కు ఇష్టపడేవారు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. దసరాకి భారీస్థాయిలో సందడి ఉండనున్నట్టు తెలుస్తోంది. మరో వైపున బాలకృష్ణ 'అఖండ' కూడా దసరా వైపే కదులుతోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందేమో చూడాలి మరి. 
 
ఇదిలావుంటే, చిరంజీవి సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా మెరవనుందనే టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. దాంతో ఏ సినిమాలో? .. ఎప్పుడు? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. చిరంజీవి కథానాయకుడిగా బాబీ ఒక సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. 
 
అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా సోనాక్షి అయితే బాగుంటుందని భావించిన బాబీ, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడని అంటున్నారు. దాదాపు ఆమెనే ఖరారు కావొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు