సినీ నటి రంభ మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్తతో కలిసివుండేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటికే ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా తనకు నెలకు రూ.2.50 లక్షలు ఇప్పించాలని కోరింది. ఈ మేరకు మరో అనుబంధ పిటీషన్ను కోర్టులో దాఖలు చేసింది.
ఈ పరిస్థితుల్లో సమాజంలో ఒంటిరి మహిళగా జీవించడం కష్టంగా ఉందని, తన భర్తతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆమె చెన్నై కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దానికి అనుబంధంగా నేడు ఆమె మరో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్తతో కలిసి జీవించే పిటిషన్ అంశంలో కోర్టు తుది ఉత్తర్వులు జారీచేసే లోపు తనకు నెలకు రెండున్నర లక్షల రూపాయల భృతిని తన భర్త నుంచి ఇప్పించాల్సిందిగా పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరింది.
తన భర్తకు కెనడాలో వ్యాపారాలున్నాయని, ఆయన నెలకు 25 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారని పిటిషన్లో రంభ పేర్కొంది. సినిమా అవకాశాలు రావడం లేదని, ఇలాంటి సమయంలో తనకు ఇతర ఆదాయ మార్గాలు కూడా లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమార్తెల పోషణ, ఆలనా పాలన, విద్య, ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు రెండున్నర లక్షల రూపాయల భృతి ఇచ్చేలా తన భర్త ఇంద్రన్ను ఆదేశించాలని రంభ పిటిషన్ లో కోరింది. ఈ పిటీషన్లపై కోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.