పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

ఠాగూర్

సోమవారం, 2 జూన్ 2025 (18:07 IST)
ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం తెరకెక్కించిన చిత్రం "హరిహర వీరమల్లు". పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. దీంతో ఈ సినిమా టిక్కెట్ ధరలను పెంచాలని చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌ అధ్యక్షుడు భరత్ భూషణ్‌ను కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. 
 
ఆ చిత్ర హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ అభ్యర్థనను సరైన పద్దతిలో తెలుగు ఫిల్మ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నట్టు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాత ఏఎం రత్నం ఫిల్మ్ చాంబర్‌ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, భారీ బడ్జెట్‌, ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో టికెట్ ధరల విషయంలోనూ, అదనపు షోల ప్రదర్శనలోనూ ముందస్తుగా అనుమతులు తీసుకోవడం ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను ప్రదర్శించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఫిల్మ్ చాంబర్‌కు అందని ఈ వినతి పత్రాన్ని వారు పరిశీలించి తదుపరి చర్యల కోసం ఏపీ ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. ఈ పరిణామంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు