నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం "హిట్-3". మే ఒకటో తేదీన విడుదలకానుంది. 'హిట్' సిరీస్లో భాగంగా వస్తున్న మూడో చిత్రం. శైలేష్ కొలను దర్శకత్వం వహించగా, హీరో నాని సరసన శ్రీనిధి శెట్టి నటించారు. అయితే, ఈ చిత్రం గురువారం విడుదలకానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మూవీకి టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై రూ.50 (జీఎస్టీతో కలిసి), మల్టీప్లెక్స్లలో రూ.75 (జీఎస్టీతోకలిపి) చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెరిగిన ధరలు వారం రోజుల పాటు అమల్లో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక ఈ చిత్రాన్ని నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్ బ్యానర్పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న "హిట్-3"కి ఏ సర్టిఫికేట్ మంజూరు చేసిన విషయం తెల్సిందే.