ప్లీజ్.. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు.. నేనింకా కోలుకోలేదు : అమితాబ్

శుక్రవారం, 24 జులై 2020 (09:35 IST)
బాలీవుడ్ సినీ దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఈయన ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈయనకు నిర్వహించిన తాజా పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని వచ్చినట్టు వార్తలు వచ్చాయి. జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా అయితే, ఏకంగా బ్రేకింగ్ న్యూస్ కథనాలను ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో కూడా అమితాబ్ కరోనా నెగెటివ్ టెస్టుపై పోస్టులు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. 
 
అయితే, ఈ వార్తలను అమితాబ్ ఖండించారు. టెస్టులో తనకు నెగెటివ్ రాలేదని... తాను కోలుకున్నాననే వార్తలో నిజం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాధ్యతారాహిత్యంగా తప్పుడు వార్తను ప్రసారం చేశారని అసహనం వ్యక్తం చేశారు.
 
కాగా, ఈ నెల 12వ తేదీన అమితాబ్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కుమారుడు అభిషేక్ బచ్చన్‌కి కూడా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన కూడా ఆసుపత్రిలో చేరారు. దీంతో, అభిషేక్ భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్య హోం ఐసొలేషన్‌లో గడిపారు. అయితే, రెండు రోజుల తర్వాత వీరిద్దరికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. అమితాబ్ భార్య జయా బచ్చన్‌కు మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది.
 
అమితాబ్ కుటుంబానికి కరోనా వచ్చిన నేపథ్యంలో ఆయన బంగ్లా జల్సాను బీఎంసీ అధికారులు శానిటైజ్ చేశారు. బంగ్లా వెలుపల కంటైన్మెంట్ నివాసంగా బోర్డును ఏర్పాటు చేశారు. మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే, ఎప్పటికప్పుడు అమితాబ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు