కంగనా ఇంటిని కూడా కూల్చివేస్తారా? నోటీసులిచ్చిన బీఎంసీ?

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (12:57 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌కు ముంబై మునిసిపల్ (బీఎంసీ) అధికారులు మరోమారు షాకిచ్చిచ్చారు. ఇప్పటికే ఆమె సినీ కార్యాలయంలో అనుమతి తీసుకోకుండా అక్రమ నిర్మాణం చేపట్టారంని ఆరోపించి, ఆ కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చివేశారు. ఇపుడు కంగనా రనౌత్ ఉంటున్న ఇల్లు కూడా అక్రమమేనంటూ బీఎంసీ అధికారులు షాకిచ్చారు. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు. 
 
ప్రస్తుతం ఖర్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో కంగనా ఐదో అంతస్తులో నివాసం ఉంటుండగా, అదే భవనంలో ఆమెకు మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలేనని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, తమ నోటీసులకు సమాధానం ఇవ్వాలని అధికారులు కోరడం మరోమారు కలకలం రేపింది.
 
కాగా, తన కార్యాలయం కూల్చివేతను అడ్డుకునేందుకు బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగన, స్టే ఆర్డర్‌ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత, కంగన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపగా, శివసేన నేతలు మండిపడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ కంగనా ఆదివారం నాడు రాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీని కలిసి ఫిర్యాదు చేసింది కూడా. ఈ క్రమంలో బీఎంసీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు