వ్యక్తిగత స్వార్థం కోసం ఓ అమ్మాయిని బలి చేశారు : రియాకు సెలెబ్రిటీల మద్దతు

గురువారం, 8 అక్టోబరు 2020 (11:27 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్.సి.బి. అరెస్టు చేసింది. ఇదే కేసులో మరో 11 మందిని కూడా అరెస్టు చేసింది. అయితే, ఈ కేసులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రియా చక్రవర్తి బుధవారం రాత్రి ముంబైలోని బైకులా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, ఆమెకు మద్దతుగా సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఆమెకు బెయిలు రావడాన్ని స్వాగతించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు పోస్టుల ద్వారా సంఘీభావం తెలిపారు.
 
వ్యక్తిగత స్వార్థాల కోసం ఓ అమ్మాయిని, ఆమె కుటుంబ గౌరవాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న వారిని చూస్తుంటే సిగ్గుగా ఉందని నటి హుమా ఖురేషీ పేర్కొంది. సుశాంత్ మృతిని హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన అందరిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. 
 
ఇప్పటివరకు జరిగిన ఘటనల వల్ల రియాకు నిరాశ రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తాప్సీ పేర్కొంది. సుశాంత్‌కు న్యాయం జరగాలని కోరుకుంటున్న కొందరు వ్యక్తుల కోపం రియాను జైలులో చూసిన తర్వాత తగ్గి ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది.
 
రియాపై దయ చూపించినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పినట్టు దర్శకురాలు ఫర్హాన్ ఖాన్ పేర్కొనగా, మొత్తానికి రియాకు బెయిలు వచ్చిందని దర్శకుడు అనుభవ్ సిన్హా వ్యాఖ్యానించారు. రియా ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని మరో దర్శకుడు హన్సాల్ మెహతా సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు