పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందు ఇపుడు పెద్ద సమస్య వచ్చిపడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్గా పాకిస్థాన్ మూలాలు ఉన్న ఇమాన్విని ఎంపిక చేశారు. ఇదే ఇపుడు సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో ఉగ్రవాదులు పాశవికదాడికి పాల్పడి 25 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో పాకిస్థాన్పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
పాక్పై భారత్ కూడా దౌత్య యుద్ధానికి తెరలేపింది. పాకిస్థాన్ను తాగు, సాగునీటిని సరఫరా చేసే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. వాఘా, అట్టారీ సరిహద్దులను మూసివేసింది. అలాగే, భారత్లోని పాకిస్థాన్ పౌరులు 48 గంటలు లేదా మే ఒకటో తేదీలోపు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాలన్నీ ప్రభాస్ సినిమాలోని హీరోయిన్ ఇమాన్వికి ప్రతికూలంగా మారాయి. దీంతో ఆమెను సినిమా నుంచి తొలగించాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇమాన్వి నేపథ్యానికి సంబంధించిన కొన్ని అంశాలు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది.
ఇమాన్వికి పాకిస్థాన్ మూలాలు ఉన్నాయని, ఆమె తండ్రి పాకిస్థాన్ సైన్యంలో గతంలో మేజర్గా పని చేసి ఆ తర్వాత ఆమెరికాలో స్థరపడ్డారంటూ ప్రచారం సాగుతోంది. ఈ సమాచారం ఆధారంగా, పాకిస్థాన్ మూలాలు ఉన్న వ్యక్తిని తమ అభిమాన హీరో సినిమాలో హీరోయిన్గా వద్దంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. పహల్గామ్ దాడి ఘటన నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ డిమాండ్లకు ఇపుడు ప్రాధాన్యత చేకూరింది. ఇది ప్రభాస్కు కూడా ప్రతికూలంగా మారింది.