సినిమా టిక్కెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందా? హైకోర్టు ప్రశ్న

వరుణ్

గురువారం, 11 జులై 2024 (09:23 IST)
కొత్త సినిమాల విడుదల సమయంల సినిమా టిక్కెట్ ధరలను పెంచే ఆనవాయితీ ఉంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కూడా టిక్కెట్ ధరలు పెంచేందుకు, అదనపు ఆటలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. అయితే, ఏపీ హైకోర్టు ఇపుడు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు.. సినిమా టిక్కెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అనే అంశంపై లోతుగా విచారణ చేస్తామని పేర్కొంది. సినిమా టిక్కెట్ ధరల విషయంలో గతంలో దాఖలైన వ్యాజ్యంతో ప్రస్తుత పిల్ల‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 
 
కల్కి సినిమా టిక్కెట్ ధరలను 14 రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెల్సిందే. దీన్ని సవాల్ చేస్తూ పి.రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎన్. ప్రణతి వాదనలు వినిపిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలంటూ కోరారు. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కల్కి చిత్రం నిర్మాత సి.అశ్వనీదత్‌లకు కూడా నోటీసులు జారీచేయాలని ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు