కరోనా వైరస్ బారినపడిన టాలీవుడ్ నటి చార్మీ తల్లిదండ్రులు!

సోమవారం, 26 అక్టోబరు 2020 (14:11 IST)
టాలీవుడ్ నటి, సినీ నిర్మాత చార్మీ తల్లిదండ్రులు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని చార్మీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.
 
తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఇటీవలి హైదరాబాద్ వరదలు, ఇతర పరిస్థితుల కారణంగా వారు కరోనా బారిన పడినట్టు ఛార్మి తెలిపింది. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని పేర్కొంది. తన తల్లిదండ్రులను తిరిగి ఆరోగ్యవంతులుగా చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని చార్మీ చెప్పుకొచ్చింది. 
 
తెలంగాణ ఏడు జిల్లాల్లో కరోనా కేసులు నిల్! 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమేణా తగ్గుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 582 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 
 
గత 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2,31,834కి చేరుకుంది. మొత్తం 1,311 మంది మృతి చెందారు. 
 
గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 174, నల్గొండ జిల్లాలో 87, రంగారెడ్డి జిల్లాలో 55, మేడ్చల్ జిల్లాలో 38, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. 
 
మిగిలిన జిల్లాల్లో ఆదిలాబాద్ 9, జగిత్యాల్‌ 14, జనగాం 2, జోగులమ్మ గద్వాల్‌ 4, కరీంనగర్‌ 15, ఖమ్మం 17, మహబూబ్‌ నగర్‌ 15, మహబూబాబాద్‌ 13, మంచిర్యాల్‌ 2, మెదక్‌ 4, నాగర్‌ కర్నూల్‌ 6, నల్గొండ 87, నిజామాబాద్‌ 24, రాజన్న సిరిసిల్ల 4, సంగారెడ్డి 31, సిద్ధిపేట్‌ 15, సూర్యాపేట 4, వికారాబాద్‌ 4, వనపర్తి  1, వరంగల్‌ రూరల్‌ 7, వరంగల్‌ అర్బన్‌ 13, యాద్రాది భువనగిరి 2 కేసులు నమోదయ్యాయి. 
 
80 లక్షలకు చేరిన కరోనా కేసులు 
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖంపడుతోంది. గత 24 గంటల్లో 45,149 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,960కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో కరోనా కారణంగా 480 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,19,014కి పెరిగింది. 
 
ఇక 24 గంటల్లో 59,105 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 71,37,229 మంది కోలుకున్నారు. మరోవైపు, త్వరలోనే రెండో దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరు చెపుతున్న నేపథ్యంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు