9 నెలల తర్వాత 'బొమ్మ' పడింది.. ఎక్కడ..

మంగళవారం, 8 డిశెంబరు 2020 (09:29 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత తొమ్మిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. వాస్తవానికి ఈ మహమ్మారికి ముందు ప్రతి గురు, శుక్ర వారాల్లో ఏదో ఒక కొత్త చిత్రం విడుదలవుతూ వచ్చేది. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు. దీంతో పాత సినిమాలనే ప్రదర్శిస్తున్నారు. 
 
కాగా, హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది నెలల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. ప్రదర్శనశాలల్లో కొవిడ్‌ నిబంధనలుకు అనుగుణంగా శానిటైజర్లు, అవగాహన కల్పించే పోస్టర్లు, స్లోగన్స్‌, భద్రతా నిబంధనలు ఏర్పాటు చేశారు. ఇక ఒకటి రెండు చిత్రాలను విడుదల చేయగా ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగానే ఉందని పలు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.  
 
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 50 శాతం సిట్టింగ్‌తో రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు ప్రారంభించారు. పలు భద్రతా చర్యలు తీసుకొని ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు థియేటర్ల యజమానులు సిద్ధమయ్యారు. నగరంలో ఇప్పటికే ప్రదర్శనలను షురూ చేశారు. 
 
ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌లో 650 సీటింగ్‌ కెపాసిటీ ఉండగా 50 శాతం సిట్టింగ్‌ అంటే 325 మంది ప్రేక్షకులకు అనుమతి ఉండగా.. ఆ థియేటర్‌లో 300 టికెట్లు అమ్ముడుపోయినట్టు థియేటర్ యాజమాన్యం తెలిపింది. 
 
ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని దేవి థియేటర్‌లో ఒక ఆటకు 130 మందికి పైగా ప్రేక్షకులు వచ్చినట్టు తెలిసింది. అయితే శుక్ర, శనివారాల్లో ప్రదర్శించిన హాలీవుడ్‌ ‘టినెట్‌' సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదు. వచ్చే శుక్రవారం వరకు ఏదైనా తెలుగు సినిమా విడుదలైతే ప్రేక్షకులకు థియేటర్లకు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు