'కలర్స్' స్వాతి కాదు.. ఇకపై శ్రీమతి స్వాతి... 2న రిసెప్షన్....

శనివారం, 1 సెప్టెంబరు 2018 (10:56 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి 'కలర్స్' స్వాతి. బుల్లితెరకు 'కలర్స్' అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన యువతి కలర్స్ స్వాతి. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, పిమ్మట హీరోయిన్‌గా మారింది. ఇపుడు శ్రీమతిగా మారింది.
 
మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. వీరిద్దరూ కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకారం తెలపడంతో ఈ జంట ఒక్కటయ్యింది. ఈ పెళ్లి ఎలాంటి అనవసర హంగామా లేకుండా ఎంతో సింపుల్‌గా జరిగింది. 
 
అంతేకాదు ఈ వివాహమహోత్సవాన్ని పూర్తిగా ప్రైవేటు వేడుకగా నిర్వహించారు. టాలీవుడ్ - కోలీవుడ్ నుంచి పెద్దగా సెలబ్రెటీల్ని ఆహ్వానించలేదని తెలుస్తోంది. కేవలం స్వాతి సన్నిహితులు - ఇరు కుటుంబ సభ్యులు, వారి తరపున బంధువులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. సెప్టెంబర్‌ 2న వివాహ విందు ఇవ్వనుంది. 
 
కాగా, కలర్స్ స్వాతి పలు చిత్రాల్లో నటించింది కూడా. ముఖ్యంగా, 'అష్టాచెమ్మా', 'స్వామిరారా', 'కార్తికేయ' వంటి చిత్రాల్లో నటించి మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా, ఈ అమ్మడుపై పలు రకాల ప్రేమ ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా సినీ ఇండస్ట్రీలో కొనసాగిన కలర్స్ స్వాతి ఇపుడు ఓ ఇంటికి కోడలైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు