ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ''మేం ఇళయరాజా గారి దగ్గరకు పాటల రికార్డింగ్ కోసం చెన్నై వెళ్ళాం. రెండు పాటలకు బాణీలు అందించారు. సెకండ్ సాంగ్ రికార్డింగ్ టైంలో మూడో పాట కూడా తీసుకోవచ్చు కదా, మళ్ళీ రావడం ఎందుకని రాజా గారు చెప్పారు. సందర్భం చెప్పిన తర్వాత ఆయనొక బాణీ ఇచ్చారు. రెగ్యులర్ టైపు సాంగ్ కాదది. ఆ పాటలో కథ చెప్పాలి. ఆ అమ్మాయి జీవితంలో జరిగిన విషయాలు చెబుతున్నట్టు ఉండాలి. అలాగే, ప్రేమిస్తున్న వ్యక్తికి ఆ అమ్మాయి తాను ఇలా ఉండబోతున్నానని చెప్పాలి. అప్పటికి రెహమాన్ గారు, చైతన్య ప్రసాద్ గారు పాటలు రాశారు. వాటిలో వాళ్ళ స్టైల్ వినబడుతోంది. కొంచెం కొత్తగా వెళదామని అనుకున్నాను.
కీరవాణి గారిలో చమత్కారమైన రైటర్ ఉంటారు. ఆయన రాస్తే అందరికీ అర్థమయ్యేలా, సాహిత్య విలువలతో, క్యాచీగా ఉంటుందని అనిపించింది. మెల్లగా నా మనసులో మాటను రూపేష్ గారికి చెప్పాను. ఆ తర్వాత చైతన్య ప్రసాద్ గారి చెవిలో వేశా. ట్రై చేద్దామని ఆసక్తి చూపించారు. అప్పుడు ఆ తర్వాత మరో ఆలోచన లేకుండా కీరవాణి గారిని సంప్రదించాం. ఆయనకు చైతన్య ప్రసాద్ గారు ఫోన్ చేశారు. వేరే సినిమా రీ రికార్డింగ్ చేయడం కోసం ఆయన చెన్నైలో ఉన్నారు. వెంటనే కలిసి 'షష్టిపూర్తి'లో పాట రాయమని అడిగాం.
రాజా గారికి చెప్పారా? అని కీరవాణి గారు అడిగారు. మీరు ఓకే అంటే చెబుదామని చెప్పాను. బాణీ అడిగారు. పల్లవి రాసి పంపిస్తానని, నచ్చితే పాట రాస్తానని అన్నారు. కీరవాణి గారి దగ్గర నుంచి రాజా గారి స్టూడియో దగ్గరకు వెళ్లే సరికి పల్లవి వచ్చింది. చైతన్య ప్రసాద్ గారు చదివి వినిపించారు. నభూతో న భవిష్యత్. అంత అద్భుతంగా రాశారు. అనన్యా భట్ కూడా పాటను అద్భుతంగా పాడారు. రాజా గారి బాణీలో కీరవాణి గారి సాహిత్యం, అనన్యా భట్ గాత్రం కలిసి పాట అద్భుతంగా వచ్చింది'' అని అన్నారు.
రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిది. రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాలో 'కాంతార' ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, 'చలాకి' చంటి, 'బలగం' సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అంబరీష్ అప్పాజీ ఇతర ప్రధాన తారాగణం.