ప్రఖ్యాత దర్శకులు మణిరత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీతో డ్యూయెట్ అనే ఒక ఏక్షన్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
రోజా సినిమా తరువాత మణిరత్నం రూపొందిస్తోన్న ఏక్షన్ లవ్ స్టోరీ జానర్ సినిమా ఇదే కావటం విశేషం. ఈ చిత్రానికి "మొజార్ట్ ఆఫ్ మద్రాస్" ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం రెహమాన్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ని తలపించే అద్భుతమైన మ్యూజిక్ ఈ చిత్రంలో ఉంటుంది అని చిత్ర బృందం చెబుతోంది.
"ఓకే బంగారం సినిమా షూటింగ్ ప్రారంభం లోనే మణిరత్నం గారు నాకు స్టోరీ చెప్పారు. చాలా నచ్చి తెలుగులో రిలీజ్ చేశాను. ఇప్పుడు అదే మాదిరిగా మళ్ళీ ఈ డ్యూయెట్ సినిమా స్టోరీ షూటింగ్ ప్రారంభంలో చెప్పారు. ఇది మణిరత్నం గారు అందించే మరో సూపర్హిట్ అనే నమ్మకం ఉంది. అందుకే తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మార్చి 2017లో సినిమా రిలీజ్ ఉంటుంది", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.
డిసెంబరులో ఒక ఫారిన్ షెడ్యూల్తో చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటి దాకా చెన్నై, హైదరాబాద్, లేహ్ లడఖ్లలో డ్యూయెట్ను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం ఎ.ఆర్. రెహమాన్, సినిమాటోగ్రఫీ- రవివర్మన్, ఎడిటింగ్ - శ్రీకర్ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే దర్శకత్వం- మణిరత్నం, నిర్మాత - దిల్ రాజు, సమర్పణ : శిరీష్.