కృష్ణ పుట్టినరోజు నాడు మహేష్‌ అభిమానులకు డబుల్ ధమాకా..!

శనివారం, 9 మే 2020 (12:00 IST)
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31. ఆ రోజున అభిమానులకు పండగా రోజు. అయితే.. ఈ మే 31న అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారని టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే... మే 31న మహేష్ బాబు తన కొత్త సినిమాని ప్రారంభించనున్నారు. గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో మహేష్‌ బాబు సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను మే 31న సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 
 
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. డబుల్ ధమాకా ఏంటంటే... అదే రోజు మరో సినిమాని కూడా ఎనౌన్స్ చేయాలనుకుంటున్నారని టాక్. ఇంతకీ ఎవరితో సినిమాని ఎనౌన్స్ చేస్తాడంటే... దర్శకధీరుడు రాజమౌళి తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నట్టు ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన డా.కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా మే 31న ప్లాన్ చేస్తున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మహేష్‌ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. రాజమౌళి ఎనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పైన అభిమానులు ఆరా తీయడం స్టార్ట్ చేసారు. ఇక మహేష్ పుట్టినరోజు నాడు ప్రకటిస్తారని వార్తలు వస్తుండటంతో మరింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదే కనుక నిజమైతే.. మే 31న మహేష్ అభిమానులకు డబుల్ ధమాకానే..!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు