విజయ్ దేవరకొండకు అండగా చిరంజీవి : పిచ్చి రాతలు పట్టించుకోవద్దు

మంగళవారం, 5 మే 2020 (12:37 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. పిచ్చి రాతలను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. ఇలాంటి రాతల వల్ల నేను, నా కుటుంబం కూడా బాధపడిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. 
 
కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో పేదల సహాయార్థం తన ఫౌండేషన్ తరపున విరాళాలు సేకరిస్తున్న హీరో విజయ్ దేవరకొండ‌పై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ వార్తలను ఖండించిన విజయ్‌కు మద్దతుగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖలు నిలిచారు. తాజాగా, ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. 'కిల్ ఫేక్ న్యూస్' హ్యాష్ టాగ్‌తో ఓ ట్వీట్ చేశారు.
 
'డియర్ విజయ్.. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను, నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి' అని పేర్కొన్నారు. 
 
విజయ్‌కు అండగా నిలుస్తామని. ఇలాంటి రాతల వల్ల చేసే మంచి పనులు ఆపవద్దని విజయ్‌ని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు కూడా ఓ సూచన చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను వార్తలుగా మలచొద్దని అన్నారు. 
 
అలాగే, టాలీవుడ్ సెలెబ్రిటీలు మహేష్ బాబు, రానా దగ్గుబాటి, శివ కొరటాల, రాశీ ఖన్నా, రవితేజ, అల్లరి నరేష్, సీనియర్ నటి రాధికలు కూడా మద్దతు తెలిపారు. తప్పుడు వార్తలపై పోరాటం చేయాలని వారంతా పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు