బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు ఇకలేరు

గురువారం, 12 డిశెంబరు 2019 (13:38 IST)
బహుముఖ ప్రజ్ఞాశాలి, నటుడు, రచయిత గొల్లపూడి మారుతీ రావు మనమధ్య ఇకలేరు. ఆయన గురువారం మధ్యాహ్నాం చెన్నైలోని లైఫ్‌లైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 80 యేళ్లు. 
 
తన సినీ కెరీర్‌లో 250కి పైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి విజ‌య‌న‌గ‌రంలో 1939 ఏప్రిల్ 14న జ‌న్మించారు. 13 ఏళ్ల వ‌య‌స్సులోనే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించారు. 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' చిత్రంతో న‌టుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన గొల్ల‌పూడి .. డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి చిత్రానికి ఉత్త‌మ ర‌చ‌యిత‌గా నంది పుర‌స్కారం అందుకున్నారు.
 
రేడియో వ్యాఖ్యాతగా, జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించిన గొల్లపూడి ఆ తర్వాత నవలా రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన అనేక వ్యాసాలు కౌముది పేరుతో ప్రచురితమయ్యేవి. నటనా, రచనా రంగాల్లో ఆయన తనదైనముద్రను వేశారు. స్వాతిముత్యం వంటి చిత్రాల్లో వినూత్న విలనిజాన్ని చూపెట్టారు. 
 
ముఖ్యంగా పత్రికా వ్యాసాల్లో గొల్లపూడి ముద్ర ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి... కొంతకాలం విశాఖలో, మరికొన్ని రోజులు చెన్నైలో ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతి టాలీవుడ్ పరిశ్రమ‌కి తీర‌ని లోటు. గొల్ల‌పూడి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని సినీ ప్ర‌ముఖులు ప్రార్థిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు