రైతు సౌభాగ్య దీక్ష - పక్కపక్కనే పవన్ కళ్యాణ్ - నాగబాబు

గురువారం, 12 డిశెంబరు 2019 (13:02 IST)
ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ రైతు సౌభాగ్య దీక్ష పేరుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో గురువారం కాకినాడ వేదికగా దీక్షసాగుతోంది. ఈ దీక్షలో పవన్‌తో పాటు.. ఆయన అన్న, సినీ నటుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. 
 
కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఐ.టి.ఐ పక్కన ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి ఉదయం 8 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మహిళలు హారతులు పట్టగా.. రైతులు పూల మాల వేసి ఆయనను వేదిక మీదకు ఆహ్వానించారు. రైతు దీక్షకు సంకేతంగా రైతులు, పార్టీ నాయకులు పచ్చని కండువాను కప్పి, వరి కంకులు బహుకరించారు. 
 
అప్పటికే అక్కడికి చేరుకున్న జనసైనికులు, నాయకులు, రైతులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, తూర్పు గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన నాయకులు, రైతు సంఘాల నేతలు వేదికపై దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. మరో వైపు జనసేనాని దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి జన సైనికులు, రైతులు భారీగా తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు