మనశ్శాంతి కోసం నా భర్త నితిన్ దేవతల వద్దకు వెళ్లారు : నటి జయసుధ

శనివారం, 18 మార్చి 2017 (11:01 IST)
సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ కుపూర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. తన భర్త ఆత్మహత్యపై జయసుధ స్పందిస్తూ "నా భర్త మనశ్శాంతి కోసం దేవతల వద్దకు వెళ్లారు. ఇపుడు ఆయన దేవతల మధ్య ఉన్నారు. ఎప్పట్నుంచో ఆయన వెదుకుతూ వచ్చిన మానసికశాంతి చివరికి అక్కడ లభించింది. పైనుంచి ఆయన కురిపించే ప్రేమ, ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ రక్షణగా ఉంటాయి’’ అంటూ తన భర్తని గుర్తు చేసుకొన్నారు. 
 
మార్చి 17వ తేదీ శుక్రవారం నితిన్‌ కపూర్‌, జయసుధల పెళ్లి రోజు. ఈ సందర్భంగా ఆయన్ని ఫేస్‌బుక్‌ ద్వారా గుర్తు చేసుకొన్నారు. ‘‘32 ఏళ్ల కిందట ఇదే రోజు నా భర్త నితిన్‌ కపూర్‌ని పెళ్లి చేసుకొన్నా. మేం కలిసి గడిపిన మధురమైన క్షణాలెన్నో గుర్తుకొస్తున్నాయి. దేవుడు ఆయనకి మరింత శాంతిని, సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకొంటున్నా. 
 
డిప్రెషన్ అన్నది చాలా తీవ్రమైన మెడికల్ కండిషన్. నా జీవితంలో చీకటిని నింపిన ఈ సంఘటనని సంచలనాత్మకం చేయకుండా సంయమనం పాటించిన మీడియాను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. మా కుటుంబానికి ఇప్పుడు కావల్సింది స్వేచ్ఛ. ఈ కష్టకాలంలో నాకు, నా కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ నా కృతజ్ఞతలు’’ అంటూ ఫేస్‌బుక్‌ ద్వారా జయసుధ స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి