సినిమా పరిశ్రమలో వెనుక ముందు తెలిసిన వారు ఎవరు లేకుండా విజయం సాధించటం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా ఉన్న నేను ముందుగా పరిశ్రమలో అనుభవం సంపాదించటానికి 2012లో ‘‘ప్రేమలో పడితే’’ చిత్రంతో కో–ప్రొడ్యూసర్గా కెరీర్ను ప్రారంభించాను అన్నారు ‘‘ శ్రీ షిరిడీ సాయి మూవీస్’’ అధినేత రాజశేఖర్ రెడ్డి.
పలు చిత్రాల గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘ 2012లోనే విజయ్ ఆంటోనినీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్ధేశ్యంతో ‘నకిలీ’ చిత్రాన్ని విడుదల చేశాను. 2013లో ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.యల్ విజయ్తో ఉన్న పరిచయంతో మేమిద్దరం నిర్మాతలుగా మారి ‘శైవం’ అనే చిత్రాన్ని నిర్మించి చక్కని విజయాన్ని సాధించాం. 2014లో తెలుగులో ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రాన్ని తమిళంలో ‘శ్రీధర్’ అనే పేరుతో విడుదల చేశాను. ‘కలర్స్’ స్వాతి కీ రోల్లో నటించిన ‘త్రిపుర’ చిత్రాన్ని 2015లో నిర్మించాను. తర్వాత ‘కేరాఫ్ కంచెరపాలెం’ చిత్రాన్ని తమిళంలో ‘కేరాఫ్ కాదల్’గా 2021లో విడుదల చేయటం జరిగింది.
- ప్రస్తుతం 2022లో ఆరు సినిమాలను విడుదల చేయబోతున్నాను అనే విషయాన్ని మీతో పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఆరు సినిమాలు కూడా పెద్ద టెక్నీషియన్స్ గొప్ప నటీనటులతో చేయటం నాలాంటి నిర్మాతలకు చాలా పెద్ద విషయం. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా ‘క్లాప్’, విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జ్వాల’, విశ్వక్సేన్ ముఖ్యపాత్రలో నలుగురు ప్రముఖ హీరోయిన్లు నటించిన చిత్రం ‘అక్టోబర్ 31’, ప్రకాశ్రాజ్ కీలకపాత్రలో నవీన్చంద్ర, మేఘా ఆకాశ్ నటిస్తోన్న ఇంకా పేరు పెట్టని చిత్రం, తమిళ కమెడియన్ యోగిబాబు హీరోగా మరో చిత్రాన్ని 2022లో విడుదల చేస్తాను. వచ్చే ఏడాది నా కెరీర్లోనే బెస్ట్ ఇయర్గా చెప్పాలి. కారణం ఏంటంటే బాలీవుడ్, టాలీవుడ్ ఆర్టిస్ట్లతో ఓ పాన్ ఇండియా సినిమాను నిర్మించనున్నాను. నా పదేళ్ల కెరీర్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాలు నిర్మించాను. ఇలాగే సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అన్నారు.