హత్రాస్ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలి : కంగనా

బుధవారం, 30 సెప్టెంబరు 2020 (20:03 IST)
హత్రాస్ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేసిపడేయాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కోరారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశారు. హత్రాస్ అత్యాచార బాధితురాలి మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ పట్టణానికి చెందిన 20 ఏళ్ల ఎస్సీ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి నాలుక కోసి హింసించారు. 
 
ఈ కామాంధులు లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయువతి ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. ఆమె శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయాయి. శరీరంలోని పలు అవయవాలు పని చేయని స్థితిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రగిల్చింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా స్పందించింది. హైదరాబాద్‌లో దిశ హంతకులకు విధించిన శిక్షనే వీరికీ విధించాలని ట్వీట్ చేసింది. 'యోగీ ఆదిత్యానాథ్ గారూ.. మీపై నాకు చాలా నమ్మకముంది. దిశ హంతకులకు ఎలాంటి శిక్ష పడిందో అలాంటి శిక్షనే వీళ్లకీ విధించాల'ని ట్వీట్ చేసింది. 
 
మరోవైపు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఫోన్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగిని ఆదేశించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని అన్నారు.
 
మోడీ ఫోన్ చేసిన విషయాన్ని యోగి వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని చెప్పారు. దీనిపై ముగ్గురు అధికారులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేశామని... వారం రోజుల్లో ఈ ప్యానెల్ రిపోర్టు సమర్పిస్తుందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు