సినిమాలో క్లైమాక్స్లో హీరో బతుకుతాడు, విలన్లు చనిపోతారు. అయితే వారి నిజ జీవితంలో మరణిస్తే అంతకంటే విషాదం మరొకటి ఉండదు. ఇలాంటి విషాద సంఘటన ఓ కన్నడ సినిమా షూటింగ్ సమయంలో ఇటీవలే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. క్లైమాక్స్ సన్నివేశంలో నటిస్తూ ఇద్దరు నటులు నీటిలో మునిగిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కన్నడలో 'మస్తిగుడి' అనే టైటిల్తో తెరకెక్కిస్తున్న సినిమాలో దునియా విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాన్ని మాగడి తాలూకా లోని తిప్పగొండనహల్లి అనే ప్రాంతంలో ఓ పెద్ద రిజర్వాయర్ వద్ద చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో హీరో పాత్రలో నటిస్తున్న విజయ్తో పాటుగా విలన్ పాత్రల్లో నటిస్తున్న మరో ఇద్దరు నటులు అనిల్, ఉదయ్లు కలిసి హెలికాప్టర్ నుండి రిజర్వాయర్లో దూకాలి. కాని రియాల్టీ కోసం ఈత తెలియదన్నా విలన్లను నీటిలోకి తోసేసయడంతో.. చిత్రీకరణ సమయంలో నటులు ఉదయ్, అనిల్లు మృతిచెందారు.
ఈ నేపథ్యంలో ఉదయ్, అనిల్ మృతికి కారణమైన సినిమా దర్శకుడు నాగశేఖర్, సహాయ దర్శకుడు సిద్దూ, ఫైట్మాస్టర్ రవివర్మలు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మాగడి పోలీస్ స్టేషనకు వచ్చిన వారు లొంగిపోయారు. ఇప్పటికే నిర్మాత సుందర్ పి.గౌడ అరెస్టు కాగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మిగిలిన ముగ్గురు నాలుగు రోజులుగా తప్పించుకుపోగా శనివారం వారే నేరుగా పోలీస్ స్టేషనకు వచ్చి లొంగిపోయారు. నటుడు దుని యా విజయ్ వీరిని స్వయంగా పోలీసుస్టేషనకు తీసుకువచ్చారు.