కేజీఎఫ్ దర్శకుడుతో ఎన్టీఆర్.. మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్

శుక్రవారం, 7 జూన్ 2019 (09:54 IST)
తెలుగులో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మరో బిగ్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశం ఉంది. ఈ సంస్థ ఎన్టీఆర్‌తో గతంలో జనతా గ్యారేజ్ అనే చిత్రాన్ని నిర్మించింది. ఇపుడు మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. 
 
అయితే, ఈ చిత్రానికి గత యేడాది విడుదలైన కన్నడ చిత్రం 'కెజిఎఫ్'కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ బోనాంజా సృష్టించింది. 
 
ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే విషయంలో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దక్షిణాది దర్శకధీరులు రాజమౌళి, శంకర్‌తో పోటీ పడ్డారని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా విజయంతో దేశవ్యాప్తంగా ప్రముఖ హీరోల కన్ను ఈ డైరెక్టర్‌పై పడింది.
 
తమ తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండాలని చాలా మంది నిర్మాతలు, హీరోలు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టారు. ఇలా సంప్రదింపులు మొదలుపెట్టిన వారిలో తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉన్నారు. వీరు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేయించినట్టు సమాచారం. 
 
అయితే ఆ సినిమా ఏ హీరోతో ఉంటుంది, ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతోందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, అది పూర్తయ్యాక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు