మొంథా తుఫాను రాష్ట్రంలో అపార నష్టాన్ని చేకూర్చిపెట్టిందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో వెళ్ళి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవు పునరావాస కేంద్రాన్ని పరిశింలించి, తుఫాను బాధితులను పరామర్శించి, బాధితులకు నిత్యావసరవస్తువులు, తగిన పరిహారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో తుఫానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశాం. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం'' అని సీఎం తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు... తుఫాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెరను ఉచితంగా అందించనున్నారు. తుఫాను ప్రభావానికి ఎక్కువగా గురయ్యే మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకంగా 50 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.