"సైరా" తప్పక చూడాల్సిన సినిమా... చిరు నటశిఖర సమానం : మహేశ్ బాబు

గురువారం, 3 అక్టోబరు 2019 (09:10 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం గాంధీ జయంతి రోజున ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. విడుదలైన ప్రతి చోటా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అదేసమయంలో ఈ చిత్రాన్ని తొలిరోజే చూసిన సినీ సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా 'సైరా' చిత్రంపై అగ్రహీరో మహేశ్ బాబు వ్యాఖ్యానించారు. దృశ్యపరంగా సినిమా రిచ్‌గా, అద్భుతంగా ఉందని, చిరంజీవి నటన శిఖరసమానం అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'సైరా' తప్పక చూడాల్సిన సినిమా అని అన్నారు. నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్రయూనిట్ మొత్తానికి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. కళ్లు చెదిరే రీతిలో ఫొటోగ్రఫీ అందించారంటూ కెమెరామన్ రత్నవేలును ప్రత్యేకంగా ప్రస్తావించారు. 
 
అలాగే, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని బుధవారమే వెల్లడించారు. ఈ చిత్రంపై రాజమౌళి స్పందిస్తూ, సైరా నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి ప్రాణప్రతిష్ట చేశారని కితాబిచ్చారు. చరిత్ర మర్చిపోయిన వీరుడి కథకు మళ్లీ జీవం పోశారు. అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ప్రతి ఒక్కరూ కథలో ఇమిడిపోయే పాత్రలతో సినిమాకు వన్నె తెచ్చారని రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నానని, సైరా నరసింహారెడ్డి ఘనవిజయానికి వారిద్దరూ అర్హులేనని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు