కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

ఠాగూర్

సోమవారం, 20 అక్టోబరు 2025 (15:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులోని నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య కేసులో రియాజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా, సోమవారం ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ కేసు ఇంతటితో ముగిసిపోయింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నిందితుడు రియాజ్‌ను అరెస్టు చేసిన తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం ఎక్స్‌రే కోసం తీసుకెళుతున్నారు. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ లాక్కొని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు తెలిపారు. 
 
మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన రియాజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించగా, ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలోని ఓ లారీలో అతను దాగివున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని చుట్టుముట్టి అరెస్టు చేశారు. రియాజ్‌ ఎన్‌కౌంటరులో చనిపోవడంతో ఇతర ఖాకీలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు