సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

ఠాగూర్

బుధవారం, 11 జూన్ 2025 (18:38 IST)
ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీపై డ్రగ్స్ కేసు నమోదైనట్టు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఆమె పుట్టిన రోజు వేడుకలే. హైదరాబాబాద్ నగర శివారు ప్రాంతం చేవెళ్ల సమీపంలోని ఈర్లపల్లిలోని త్రిపుర సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అర్థరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో రిసార్ట్ నుంచి పెద్దపెట్టున శబ్దాలు వస్తున్నాయని, డీజేతో హోరెత్తిస్తున్నారని స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్‌‍కు సమాచారం అందించారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. ఓ మహిళా ఎస్ఐ నేతృత్వంలోని బృందంతో కలిసి త్రిపుర రిసార్ట్‌కు చేరుకున్నారు. సుమారు 10 మంది మహిళలు, 12 మంది పురుషులు డీజే సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్న దృశ్యం పోలీసులకు కనిపించింది. 
 
దీనిపై రిసార్టు మేనేజర్‌ను విచారించగా, అది సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుక అని, ఆ కార్యక్రమాన్ని తామే నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎలాంటి అధికారి అనుమతులు తీసుకోలేదని పోలీసులు వివరించారు. పార్టీ జరుగుతున్న సమయంలో ప్రదేశంలో పెద్ద అనుమతులు లేవని తేలింది. ఈ సందర్భంగా గాయని మంగ్లీని ప్రశ్నించగా పార్టీ నిర్వహణకు, మద్యం వినియోగానికి, డీజే ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తీసుకోలేదని ఆమె అంగీకరించినట్టు తెలిపారు. 
 
ఆ తర్వాత పోలీసులు పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక వ్యక్తి గంజాయి సేవించినట్టు తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం, అక్రమంగా విదేశీ మద్యం కలిగివుండటం, గంజాయి వినియోగం వంటి ఆరోపణలపై గాయని మంగ్లీ, రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు