బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమే.. సీరియస్‌గా తీసుకోవద్దు.. పోసాని

ఆదివారం, 7 జూన్ 2020 (18:17 IST)
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమేనని.. ఆయన మాటలను సీరియస్‌గా తీసుకొని ఎవరూ బాధపడవద్దన్నారు. బాలకృష్ణ ముక్కుసూటి మనిషని, ఆయన తిట్టిన ,ఆవేశ పడిన ఒక్క క్షణమేనని పోసాని అన్నారు. బాలకృష్ణ మాటలు సీరియస్‌గా తీసుకోవద్దని, ఆయన పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని బాలయ్య మంచి మానవతా వాది అని పోసాని కొనియాడారు. 
 
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై పోసాని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు మీడియాలో కాదు..జనం మధ్య ఉండాలన్నారు. రేవంత్‌రెడ్డి రూ.50లక్షలతో పట్టుబడి..కేటీఆర్‌ రాజీనామా చేయాలని అనడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. డబ్బులు ఇస్తూ పట్టుబడిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరు..ఒక్క రేవంత్‌ తప్ప అని మండిపడ్డారు.
 
తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం. కేటీఆర్‌పై మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి లేదు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్‌ అనేకసార్లు జైలుకు కూడా వెళ్లారు. కేటీఆర్‌, కేసీఆర్‌ నిజాయతీ పరులు. పేపర్‌లో వచ్చిన అంశాలను నమ్మొద్దు. మంచి నాయకులపై బురదజల్లడం సరికాదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. అది చూసి ప్రతిపక్షాలు మెచ్చుకోవాలి. దేశం కోసం యుద్ధం చేసిన వ్యక్తి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించడం సరికాదు.. అంటూ పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ కోసం పోరాడిన అతి ముఖ్యమైన వ్యక్తుల్లో కేసీఆర్‌ ఒకరు. ఏపీ తెలంగాణ సీఎంలు అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తున్నారు. జల వివాదంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని భావిస్తున్నా. చర్చలతోనే నీటి సమస్య పరిష్కారం అవుతుందని పోసాని కృష్ణ మురళి అన్నారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే ప్రతిపక్షాలు గుడ్డిగా విమర్శలు చేస్తున్నాయి. కమీషన్లు తీసుకుంటున్నారంటున్న నేతలు రుజువు చేయగలరా? తెలంగాణలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు