ముగిసిన పునీత్ అంత్యక్రియలు... పార్థవదేహాన్ని ముద్దాడిన సీఎం బొమ్మై

ఆదివారం, 31 అక్టోబరు 2021 (09:12 IST)
ఇటీవల తన ఇంట్లోని జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఒక్కసారి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన కన్నడ సూపర్ స్టార్ పనీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. లక్షలాది మంది మధ్య అభిమానుల కన్నీరు, కుటుంబ సభ్యుల రోదనల మధ్య.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 
 
బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌‌లో ప్రభుత్వ అధికారిక లంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎంలు యడియూరప్పతో, సిద్దరామయ్య, పాటు ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. 
 
ముఖ్యంగా, అంత్యక్రియలు నిర్వహించే ముందు బొమ్మై పునీత్‌ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు నిల్చుండిపోయారు. మరోసారి పునీతుడి తలను నిమిరారు. చెంపలను తడిమారు. చేతులు జోడించి పార్థివదేహానికి నమస్కరించారు. కన్నీరు పెట్టుకున్నారు. 
 
భార్య అశ్వినీ రేవంత్, కుమార్తెలు ధృతి రాజ్‌కుమార్, వందిత రాజ్‌కుమార్.. పార్థివదేహం వద్దే కొద్దిసేపు కూర్చున్నారు. కడసారి వీడ్కోలు పలికారు. పునీత్ అంటే బొమ్మైకి కూడా ఎంత అభిమాన‌మో ఈ సన్నివేశం చూస్తుంటే తెలుస్తుంది. పునీత్ ఇక లేడ‌నే విష‌యాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు