కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. ఆయనకు ఏడేళ్లు జైలుశిక్ష విధించాలంటూ చార్జిషీటును దాఖలు చేసింది. గత 2008 నాటి గురుగ్రామ్ భూముల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వాద్రాకు గరిష్టంగా ఏడేళ్ల కఠిన కారాగారశిక్ష విధించాలని కోరుతూ ఈడీ ఢిల్లీోలని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో పాటు ఈ కేసులో అక్రమంగా సంపాదించిన రూ.38.69 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను ప్రభుత్వ పరం చేయాలని కూడా కోరింది.
ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును పరిశీలించిన ప్రత్యేక కోర్టు, వాద్రాకు నోటీసులు జారీచేసింది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కేను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. గురుగ్రామ్లోని భూమి అమ్మకానికి సంబంధించిన తప్పుడు వివరాలతో దస్తావేజులు సృష్టించారని ఈడీ తన చార్జిషీటులో ప్రధానంగా ఆరోపించింది. భూమి విలువను ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ చేసి చూపారని, దీనివల్ల హర్యానా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో రూ.44 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని పేర్కొంది.
అమ్మకం దస్తావేజులో భూమి విలువ రూ.7.50 కోట్లుగా చూపినప్పటికీ వాస్తవానికి అంతకంటే ఎక్కువ మొత్తం చేతులు మారినట్టు ఈడీ తెలిపింది. ఈ లావాదేవీల ద్వారా రాబర్ట్ వాద్రా రూ.58 కోట్ల వరకు అక్రమంగా అర్జించారని, ఇది మనీలాండరింగ్ ద్వారా వచ్చిన సొమ్ము అని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లలోని మనీలాండరింగ్ జరిగినట్టు దర్యాప్తులో గుర్తించామని వెల్లడించింది.