బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట లభించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ .. రియాకు క్లీన్ చిట్ ఇచ్చింది. గత 2020 జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ మరణాన్ని ఆత్మహత్యగా పోలీసులు భావించినప్పటికీ సుశాంత్ తల్లిదండ్రులు తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పైగా, సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో రియా చక్రవర్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు కూడా ప్రశ్నించారు. పైగా, సుశాంత్కు అధిక మొత్తంలో డ్రగ్స్ ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రియా, ఆమె సోదరుడు షావిక్ జైలుకు కూడా వెళ్లారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ తుది నివేదికను కోర్టుకు అందించింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, చనిపోయేలా ఆయనను ఎవరూ బలవంతం చేయలేదని నివేదికలో కోర్టుకు తెలిపింది. సుశాంత్ మరణంలో మరొకరి ప్రమేయం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. అయితే, సీబీఐ పేర్కొన్న వివరాలు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఏ మేరకు ఏకీభవిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. సీబీఐ నివేదికను ఆధారంగా చేసుకుని సుశాంత్ కేసును కోర్టు కొట్టివేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సివుంది.