అమితాబ్ ఇల్లు జల్సా ముందు ధర్నా...

గురువారం, 19 సెప్టెంబరు 2019 (16:04 IST)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కాలుష్యం నివారణ కోసం సోషల్ మీడియాలో మంచిగా చేసిన ఓ ట్వీట్ ఆయన కొంప ముంచింది. ఆయనపై ఆగ్రహంతో పర్యావరణ ప్రేమికులు అడవులు తోటల నుంచి రావంటూ బ్యానర్‌లతో, ట్వీట్‌లతో ఆయనను విమర్శించారు. 
 
ఇంతకీ అమితాబ్ ట్వీట్‌లో ఏముందంటే.. నా స్నేహితుడికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కారులో కాకుండా మెట్రోలో ప్రయాణించాడు. తిరిగి వచ్చిన తర్వాత కారు కంటే మెట్రోలో ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉందని, వేగంగా గమ్యానికి చేరుకున్నానని వివరించాడు. కాబట్టి కాలుష్యాన్ని అరికట్టాలంటే మెట్రో ప్రయాణమే మార్గం. ఎక్కువగా చెట్లను పెంచండి. నేను నా తోటలో చెట్లు పెంచుతున్నాను. మరి మీరు? అని ఉంది.
 
కాలుష్యంపై జనాలకు అవగాహన కలిగించాలని చేసిన ట్వీట్‌తో ప్రజలు మెట్రో ప్రయాణాలు చేస్తారని భావించిన అమితాబ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తోటలో చెట్లు పెంచడం ఏంటంటూ, ఎన్ని చెట్లు పెంచినా మాత్రం తోటలు అడవులవుతాయా అంటూ పర్యావరణ ప్రేమికులు, పలువురు యువకులు అమితాబ్ నివాసమైన జల్సా ముందు నిరసన చేపట్టారు. అయితే, ముంబై మెట్రో రైల్ ఎండీ అశ్విని భిడే ట్విట్టర్ వేదికగా అమితాబ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
 
అయితే ముంబైలో మెట్రో అందుబాటులో లేని ప్రాంతాలలో దాన్ని నిర్మించాలంటే ఆరే ప్రాంతంలోని 27వేల చెట్లను నరికేయాలని బీఎంసీ సిద్ధమైంది. విషయం తెలుసుకున్న పర్యావరణ ప్రేమికులు, సామాన్యులు, ప్రముఖులు దీన్ని అడ్డుకోగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో మెట్రో అవసరాన్ని అమితాబ్ చెప్పడంతో, అలాగే తోటలో చెట్లను పెంచమనడంతో పర్యావరణ ప్రేమికులు, నెటిజన్లు ఈ చెట్లను నరికివేసేందుకు అమితాబ్ మద్దతు ఇస్తున్నారా? అంటూ మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు