'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడో చెబితే నేను చచ్చిపోతాను!: తమన్నా

సోమవారం, 2 జనవరి 2017 (16:32 IST)
"బాహుబలి" చిత్రంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెబితే తాను చచ్చిపోవాల్సి వస్తుందని మిల్క్ బ్యూటీ తమన్నా చెప్పుకొచ్చింది. అలాగే, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన మూవీలో అవకాశం చాలా అరుదుగా లభిస్తుందన్నారు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదని తమన్నా చెప్పింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాలని చెప్పింది. అంతకు ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెబితే, ఇక తాను చచ్చిపోతానని నవ్వేసింది.
 
కొత్త సంవత్సరంలో ఆమె ఓ చానెల్‌తో మాట్లాడుతూ... దర్శక ధీరుడు రాజమౌళి వంటి దర్శకుడితో పని చేయడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. రాజమౌళి అద్భుతమైన దర్శకుడని, కథపై పూర్తి పట్టుతో ఉంటారని, ఆర్టిస్టుల నుంచి తనకు ఏం కావాలో అది తీసుకుంటారని తెలిపింది. బాహుబలిలో నటించడంతో తన స్థాయి పెరిగిందని తమన్నా అంగీకరించింది. తనకు భాషతో సంబంధం లేదని, జర్మనీలో నటించే అవకాశం వచ్చినా నటిస్తానని చెప్పింది. ఒకవేళ తాను రెమ్యూనరేషన్ పెంచినా, తనకు ఎంతివ్వలో నిర్మాతలు అంతే ఇస్తారని తమన్నా చమర్కరించింది. 
 
ఇకపోతే.. టాలీవుడ్‌లో రాంచరణ్, బన్నీ, కోలీవుడ్‌లో విశాల్ తనకు మంచి స్నేహితులని చెప్పింది. వీరితో కలసి పనిచేస్తున్నప్పుడు చాలా బాగుంటుందని వ్యాఖ్యానించింది. సాధారణంగా స్నేహితులతో కలిసి నటించేటప్పుడుండే ఫీల్ వేరు కదా? అని ప్రశ్నించింది. సెట్‌లో మంచి వాతావరణం ఉంటే బాగా నటించవచ్చని చెప్పింది. అలాంటి వాతావరణం నటనపై ప్రభావం చూపుతుందని తమన్నా తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి