తనకు రాజకీయ పదవులపై ఆశలేదని, కేవలం జనసేన పార్టీ కార్యకర్తగానే ఉంటానని జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు. తన సోదరుడు, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 24వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంపై కె.నాగబాబు స్పందిస్తూ, 'హరిహర వీరమల్లు' చిత్రంపై వైకాపా నేతల దష్ప్రచారం దుర్మార్గం అన్నారు.
వైకాపాని, ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం విషయంలోనూ వైకాపా చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని కూటమి నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదేసమయంలో మరో రెండు దశాబ్దాల పాటు వైకాపా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన జోస్యం చెప్పారు.
ఇకపోతే తనకు రాజకీయ పదవులపై ఏమాత్రం ఆశ లేదన్నారు. జనసేన పార్టీ కార్యకర్తగానే ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. పార్టీలో ఇప్పటివరకు కమిటీలు వేయలేదని, అయినప్పటికీ కార్యకర్తలు సహనం పాటిస్తూ, సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించిన కార్యకర్తలనే నామినేటెడ్ పదవులకు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.