తండ్రి పేరుతో పాఠశాల భవనం నిర్మించిన టాలీవుడ్ దర్శకుడు

సోమవారం, 2 ఆగస్టు 2021 (09:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈయన మంచి మనస్సున్న మనిషి కూడా. చిన్నప్పుడు తాను చదువుకున్న తూర్పుగోదావరి జిల్లా మట్టపర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో తన తండ్రి తిరుపతినాయుడు పేరుతో రూ.18 లక్షలతో భవనం నిర్మించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌తో కలిసి సుకుమార్ దంపతులు ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించారు.
 
ఆ తర్వాత సుకుమార్ మాట్లాడుతూ, మట్టపర్రు గ్రామాభివృద్ధికి తానెప్పుడూ ముందుంటానని చెప్పారు. తన తండ్రి పేరుతో స్కూలు భవనం నిర్మించి, ప్రారంభించిన క్షణాలు మర్చిపోలేనివంటూ భావోద్వేగానికి గురయ్యారు. 
 
ఈ సందర్భంగా తాను చదువుకున్న తరగతి గదులను చూస్తూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుకుమార్ ఆ పాఠశాలలో చదువుకున్నప్పటి రికార్డును ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఫ్రేమ్ కట్టించి సుకుమార్‌కు అందజేశారు. 
 
తాను దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ సెప్టెంబరులో తిరిగి ప్రారంభమవుతుందని సుకుమార్ తెలిపారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందులో అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు