'దాసరి'ని దర్శకుడిగా పరిచయం చేసిన నిర్మాత ఇకలేరు....

మంగళవారం, 31 జులై 2018 (09:13 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ సినీ నిర్మాత కె.రాఘవ మంగళవారం హఠాన్మరణం చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు వదిలారు. ఆయన వయసు 105 యేళ్లు. ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గుండెపోటు రావడంతో చనిపోయినట్టు ప్రొడక్షన్ మేనేజర్ వెల్లడించారు.
 
కాగా, ప్రతాప్ ఆర్ట్స్ అధినేత (నిర్మాత)గా కె.రాఘవ అనేక చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా, జగత్ జంత్రీలు, తాతామనవడు, సంసారం సాగరం, జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, సూర్య చంద్రులు, అంతులేని వింతకథ, ఇంట్లో రామయ్య వీధిలో కిృష్ణయ్య, అంకితం, ఈ ప్రశ్నకు బదులేది వంటి హిట్ సినిమాలు ఆయన నిర్మించారు. 
 
1972లో 'తాతమనవడు', 1973లో 'సంసారం సాగరం' సినిమాలకుగాను ఆయనకు నంది అవార్డులు దక్కాయి. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు కూడా ఆయనను వరించింది. చిత్రపరిశ్రలో దిగ్గజాలైన దాసరి నారాయణరావు, ఎస్పీ బాలు, రావుగోపాల్‌రావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, సుమన్‌, భానుచందర్‌లను చిత్రపరిశ్రమకు ఆయన పరిచయం చేశారు. 
 
ఈయన తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి అనే గ్రామంలో 1913వ సంవత్సరంలో జన్మించారు. సినిమాపై అభిమానంతో.. సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగిన రాఘవ సుఖదుఃఖాలు చిత్రంలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తాతామనవడు చిత్రం ద్వారా దర్శకుడిగా దాసరి నారాయణ రావును వెండితెరకు పరిచయం చేశారు. 
 
ఈయన నిర్మాతగానే కాకుండా, నటుడుగా కూడా అయన బాల నాగమ్మ, చంద్రలేఖ వంటి చిత్రాల్లో కనిపించారు. రాఘవ మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులతో పాటు.. మావీ ఆర్టిస్ట్ అసోయేషన్ ప్రతినిధులు నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో నేడు జరుగుతాయని ఆయన కుమారుడు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు