కోలీవుడ్ సీనియర్ దర్శకుడు వి. సాగర్ ఇకలేరు.. చెన్నైలో మృతి

గురువారం, 2 ఫిబ్రవరి 2023 (11:18 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదకర ఘటన జరిగింది. సీనియర్ దర్శకుడు వి.సాగర్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఆయన పూర్తి పేరు ఉయ్యూరు విద్యా సాగర్ రెడ్డి. వయసు 71 యేళ్లు. ఈయన సొంతూరు విజయవాడ సమీపంలోని నంబూరు. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన చెన్నైలోనే స్థిరపడిపోయారు. ఈయనకు భార్య మాలాసాగర్, నలుగురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
గత పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సాగర్... బుధవారం ఉదయం 5.20 గంటల సమయంలో బాత్రూమ్‌కు వెళ్లేందుకు లేవగా, ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలి తుదిశ్వాస విడిచారని ఆయన భార్య మాలాసాగర్ వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం చెన్నై, టి.నగరులోని కన్నమ్మాపేట శ్మశానవాటికలో జరుగనున్నాయి. 
 
కాగా, దాదాపు 30కిపై చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్.. సొంతంగా సాగర్ పిక్చర్స్ పేరుపై కూడా ఆయన చిత్రాలు నిర్మించారు. నరేష్ - విజయశాంతి జంటగా నటించిన 'రాకాసిలోయ' చిత్రం ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన... అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు. రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెం.1, అన్వేషణ, ఓసి నా మరదలా, డాకు తదితర చిత్రాలు తీశారు. తెలుగు సినమా దర్శకుల సంఘానికి ఈయన మూడుసార్లు అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు