రెండో పాటను మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించి, యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ –“మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి.. డెఫినెట్ గా బావుంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. దర్శక నిర్మాతలకు,ఆర్టిస్టులకు అందరికీ ఆల్ ది బెస్ట్ “ అని చెప్పారు.
” ఇరు కనులు కనులు కలిసి మురిసె మొదటి చూపులో ...అంటూ రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్ , విభావరి ఆలపించారు. ఆ విశేషాలను దర్శకుడు పవన్ ప్రభ తెలియజేస్తూ “సినిమాలో చాలా అందమైన యుగళ గీతం ఇది. ఇళయరాజా బాణీ ఇవ్వగానే నాకు సాగర సంగమం లో మౌనమేలనోయి పాటలాంటి గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది. ఈ ట్యూన్ కి రెహమాన్ శరవేగంతో సాహిత్యం సమకూర్చారు. ఇళయరాజా గారు ఒక్క కరక్షన్ కూడా చెప్పకుండా ఓకే చెప్పేశారు. ఎస్పీ చరణ్,విభావరితో ఈ పాట పాడించారు. అసలు ట్యూన్ వినగానే నాదీ, రూపేష్ మొహాలు వెలిగిపోయాయి. ఇక మొత్తం పాట రికార్డు అయ్యాక మా మొహాల్లో వెన్నెల కురిసినంత ఆనందం. అసలు ఈ పాట రికార్డింగ్ కూడా చాలా లవ్లీ గా ,లైవ్లీ గా జరిగింది.
సింగర్స్ ఎవరిదారిన వాళ్ళు వచ్చి పాడి వెళ్లిపోకుండా ఇద్దరూ పక్క పక్కన నిలబడి ఓ ఫీల్ తో ఈ డ్యూయట్ ని ఆలపించారు. కధలో సమ్మిళితమైన ఈ పాట, ఈ సినిమాకే కొత్త అందాన్ని,అనుభూతిని తీసుకొచ్చింది. ఈ పాట చిత్రీకరణని రాజమండ్రి లో ఈశ్వర్ నృత్య దర్శకత్వంలో తీశాం. మంచి ఎండల్లో అందరూ కస్టపడి,ఇష్టపడి ఈ పాట బాగా రావడానికి సహకరించారు. ముఖ్యంగా మా ఛాయాగ్రాహకుడు రామ్ రెడ్డి. మామూలుగానే గోదావరి అందంగా ఉంటుంది. ఇక తోట తరణి గారి కళా దర్శకత్వ నైపుణ్యం వల్ల ఈ పాటలో గోదావరి రెట్టింపు అందంతో కనిపిస్తుంది. మా హీరో హీరోయిన్లు రూపేష్,ఆకాంక్ష సింగ్ లపై ఈ పాటను చిత్రీకరించాం” అన్నారు.