డాక్టర్ కే. రాఘవేంద్ర రావు దర్శక పర్యవేక్షణలో, జీ తెలుగులో ధారావాహిక 'కృష్ణ తులసి'

బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (17:36 IST)
జీ తెలుగు సీరియల్స్ అంటేనే అందరిని ప్రేరేపించడానికి తెరకెక్కిస్తారు. ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఇంటిలోనూ ఉన్న సగటు మనిషి కథలానే ఉంటుంది. 'ఆరంభం ఒక్క అడుగుతోనే' అనే బ్రాండ్ ట్యాగ్‌లైన్‌తో ముందుకు నడుస్తూ ఎన్నో అద్భుతమైన కథలను తెలుగు ప్రజలకి అందించిన ఛానల్ జీ తెలుగు. ముద్దమందారం, గుండమ్మ కథ, సూర్యకాంతం, త్రినయని, రాధమ్మ కూతురు, ప్రేమ ఎంత మధురం, నాగభైరవి అంటూ ఎన్నో కథలు ఆ సీరియల్ ల పాత్రలు ప్రేక్షకులను ఎంతో ఉత్తేజపరచడమే కాకుండా ప్రేరేపించాయి.
 
ఇపుడు మరోసారి అందరిని ఆకట్టుకోవడానికి ఒక సరికొత్త ధారావాహికతో వస్తుంది. అదే - 'కృష్ణ తులసి' నిస్వార్థానికి ప్రతిబింబం ఎవరంటే శ్యామా అని చెప్పవచ్చు. అలాంటి అమ్మాయి తన జీవితంలోని కష్టాలను ఎలా ఎదురుకుంటుంది? తన కుటుంబం కోసమే బ్రతికే శ్యామా, తన యొక్క జీవితాన్ని వెలుగు దారిలో ఎలా మలుచుకుంటుంది? అనే ఒక సరికొత్త ఆలోచనతో ఫిబ్రవరి 22 నుండి సాయంత్రం 6:౩౦ గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డి ఛానల్స్‌లలో ప్రసారం కానుంది.
 
శ్యామా అనే నిస్వార్థ మరియు ఆధ్యాత్మిక అమ్మాయి కథ కృష్ణ తులసి. ఆ మధురమైన గాత్రం వెనుక అంతులేని బాధ ఉంది. ఆ అమాయక చూపుల వెనుక ఊహించలేని గాధ ఉంది. ఆ తెల్లని మనసు వెనుక అలముకున్న నీడలు ఎన్నో. కుటుంబం కోసం తన గాత్రాన్ని తాకట్టు పెట్టింది. ఆ త్యాగమే శ్యామా జీవితం. అందాలని చూసి బంధాల్ని పెనవేసుకొనే ఈ లోకంలో గంధపు సువాసని పసిగట్టేది ఎవరు? ఇన్ని కష్టాల నడుమ కూడా శ్యామా తనని తానుగా ఇష్టపడే వ్యక్తి కోసం ఎదురుచూస్తుంది. కృష్ణ తులసి అనే ఈ సీరియల్ తెలుగు సినిమా దిగ్గజాలతో ఒకరైన దర్శకులు డాక్టర్ కే రాఘవేంద్రరావు గారి దర్శక పర్యవేక్షణలో ఈ సీరియల్ రాబోతుంది.
 
కృష్ణ తులసి గురించి జీ తెలుగు, జీ సినిమాలు యొక్క క్లస్టర్ హెడ్ అనురాధ గుడూర్ మాట్లాడుతూ, "జీ తెలుగు ఎప్పుడు కూడా సామజిక మార్పులతో పాటు తనని తాను మార్చుకుంటూ వచ్చింది. కొత్తతనానికి ఎల్లప్పుడూ శ్రీకారం చుడుతుంది. అలాంటి పద్దతిలోనే వస్తున్న మరో ధారావాహిక కృష్ణ తులసి. ఈ సీరియల్ తన కలలను నెరవేర్చుకోవాలని అనుకొనే ప్రతి స్త్రీ ప్రయాణానికి అద్దం పడుతుంది.తమ కలలను వారి కుటుంబాల కోసం త్యాగం చేసే ఆడవాళ్లందరికి ఈ కథ అంకితం. కృష్ణ తులసి, దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణలో రావడం, ఆయన కూడా మా జీ తెలుగు కుటుంబం లో ఒక సభ్యుడిగా ఉండడం చాల ఆనందంగా ఉంది. మా కృష్ణ తులసి ధారావాహిక అందరికి నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను."
 
డైరెక్టర్ డాక్టర్ కే రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ, "అద్భుతమైన, ఆలోచనాత్మకమైన కథలను చెప్పే జీ తెలుగుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కృష్ణ తులసి నా మనుసుని ఎంతగానో హత్తుకున్న కథ. వెలుగు నీడల పయనం మా శ్యామా జీవితం - ఆమె మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.”
 
ఎప్పుడు కూడా ప్రభావితమైన మరియు ఆకర్షితమైన ప్రోమోను విడుదల చేసే జీ తెలుగు, కృష్ణ తులసి కోసం కూడా ఒక అద్భుతమైన ప్రోమోను అందరి ముందుకు తీసుకొని వచ్చింది. నిస్వార్థమైన ప్రేమకు అర్ధం చెప్పిన మేఘన కల్యాణ వైభోగం నుంచి, పూజ గుండమ్మ కథ నుంచి , పల్లవి పసుపు కుంకుమ నుండి, వరుధిణి పరినాయం నుండి చందన మరియు చిన్న కోడలు నుండి రూప, ఏ విధంగా ఒక కోవ్వొత్తిలాగా తాను వెలుగుతూ తనతో పాటు తన కుటుంబాన్ని ఏ విధంగా ముందు తీసుకొనివెళ్లారో మన శ్యామా తో చెప్పుకుంటారు. మరి ఎంతమంది కథ విని శ్యామా తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటుందో తెలుసుకోవాలంటే కృష్ణ తులసి చూడాల్సిందే.
 
శ్యామాగా ఐశ్వర్య నటించగా, అఖిల్ కృష్ణగా దిలీప్ శెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా పవిత్ర నాథ్, ప్రత్యూష, జెఎల్ శ్రీనివాస్, రాధిక రెడ్డి మరియు ప్రముఖులు కూడా ఈ ధారావాహికల్లో కనిపించబోతున్నారు. జీ మ్యూజిక్ కంపెనీ, జీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక భాగమైన కంపెనీ ఇప్పుడు కృష్ణ తులసి సీరియల్ కోసం ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ ఆల్బం ని విడుదల చేయనుంది. శ్యామాకి ఆ శ్రీ కృష్ణుడి మీద ఉన్న భక్తిపారవశ్యాన్ని చాలా గొప్పగా సంగీత కళాకారులందరు వారి పాటలో తెలియచేసారు.
 
కృష్ణ తులసి మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా, ఛానల్ అందరిని ఆకట్టుకుని అందరి మన్ననలు పొందే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసింది. యాంకర్ సుమ చేత కృష్ణ తులసి మొక్కను నాటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత, కృష్ణ తులసి మొక్క గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల దగ్గర పంపిణీ చేయబడుతోంది. అంతేకాకుండా, కృష్ణ తులసి బొట్టు ప్యాకెట్లను మహిళా ప్రేక్షకుల కోసం తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని జిల్లాలలో పంపిణీ చేస్తోంది. ఇది ఇంటింటికీ వెళ్లి ఇవ్వడం ద్వారా, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని కృష్ణ తులసి సీరియల్ కోసం ఎదురుచూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు