తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాలీ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 8న‌ వైఎస్ఆర్ బయోపిక్ "యాత్ర"

శనివారం, 15 డిశెంబరు 2018 (14:45 IST)
జ‌న‌నేత‌గా తెలుగువారి గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్‌తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్‌తో యాత్ర స్టోరీలోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్నారు. 
 
భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్రప్ర‌దేశ్ ఎన్నికలు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వరి 8న యాత్ర‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నారు.
 
దివంగ‌త నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద యాత్ర చేశార‌నే విష‌యం మాత్ర‌మే తెలుగు ప్ర‌జ‌ల‌కి తెలుసు కాని ఆ పాద‌యాత్ర త‌న రాజ‌కీయ యాత్రలో ఎంత కీల‌క‌మో కొంత‌మందికే తెలుసు. అప్ప‌టి రాజ‌కీయ అనిశ్చితి దృష్ట్యా ఆయ‌న ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌ర‌గా వెళ్ళి వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌టానికి ఈ యాత్ర మెద‌లుపెట్టారు.. కాని ఆ యాత్ర‌లో ఎన్ని విష‌యాలు ఆయ‌న ఎంత‌ ద‌గ్గ‌ర‌గా చూశారో, సాధార‌ణమైన‌ క‌ష్టాలు కూడా తీర్చుకోలేని అతి సామాన్యుల్ని ఎలా క‌లిసారో, పేద‌వారంటే ఎవ‌రో.. వారు దేనికొసం చూస్తున్నారో ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా చూశారు.


ఆయ‌న మ‌న‌సు చ‌లించిపోయింది. జ‌నంతో మ‌మేక‌మై వారిలోని భావోద్రేకాన్ని అర్థం చేసుకుని త‌న యాత్రని కొన‌సాగించారు. ఈ యాత్ర కొన‌సాగింపు నుంచి ముగింపు వ‌ర‌కూ వున్న ఘ‌ట్టాన్ని తీసుకుని మ‌హి వి రాఘ‌వ అత్య‌ద్భుతంగా అత్యంత సున్నిత‌మైన స‌న్నివేశాల‌తో, ఆద్యంతం భావోద్రేక సంఘ‌ట‌న‌ల‌తో చిత్రం చూస్తున్నంత సేపు వైయ‌స్ గారు మ‌డ‌మ తిప్ప‌ని వైనం ఆయ‌నకి పేద‌లంటే ఎంత ప్రాణ‌మో ఈ చిత్రంలో క‌ళ్లకు క‌ట్టిన‌ట్టు చూపించారు. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ... మ‌డ‌మ‌ తిప్ప‌ని నాయకుడు శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి పాత్ర‌లో మ‌ల‌యాళీ మెగాస్టార్ మమ్ము‌ట్టి న‌టిస్తున్నారు. మ‌మ్ముట్టి ప్ర‌‌జా నాయ‌కుడు వైఎస్ఆర్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టిస్తున్నారని నిస్సందేహంగా ప్ర‌క‌టిస్తున్నాం. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన యాత్ర మొద‌టి లుక్‌కి, టీజ‌ర్‌కి, ఫస్ట్ సింగిల్‌కు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. 
 
ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం. 
 
ఆంధ్ర‌ప‌ద్రేశ్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో, రాజకీయ ఇతివృత్తంతో తెర‌కెక్కిన ఈ సినిమా వైఎస్ఆర్ అభిమానులతో పాటు సాధార‌ణ సినిమా ప్రేక్ష‌కుల‌ని అమితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని మా బృందం భావిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. తెలుగుతో పాటు ఫిబ్ర‌వ‌రి 8న త‌మిళ‌, మళ‌యాలంలో కూడా ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నాం అని అన్నారు
 
 మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్, మ్యూజిక్- కె( క్రిష్ణ కుమార్ ), ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్, సాహిత్యం- సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రొడక్షన్ డిజైన్- రామకృష్ణ, మోనిక సబ్బాని, సౌండ్ డిజైన్- సింక్ సౌండ్, వి ఎఫ్ ఎక్స్ - Knack Studios, పిఆర్ఓ- ఏలూరు శ్రీను, సమర్పణ- శివ మేక, బ్యానర్- 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు- విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్- మహి వి రాఘవ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు