శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం మలయప్ప స్వామి చిన్న శేష వాహనంపై ఊరేగారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ చిన్న శేష వాహన సేవలో భారీ సంఖ్యలు భక్తులు పాల్గొన్నారు.
రెండవరోజు ఉదయం స్వామి తన దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరించిన వైనాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. చిన్న శేష వాహన సేవ సందర్భంగా ఏడు కొండలు గోవింద నామ స్మరణతో మారు మ్రోగాయి.
ఇకపోతే.. రెండోరోజు రాత్రి స్వామివారు శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. పాలు, నీళ్లు వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా స్వామివారు ఈ వాహనంపై అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం.