సాధారణంగా ఈ భూగోళంపై ఉన్న దేవాలయాల్లో ప్రతిష్టితులైన ఉన్న మూల విగ్రహాల తొలిదర్శనం ఆలయ తలుపులు తెరిచే పూజారులకే దక్కుతుంది. కానీ, కలియుగదైవమైన శ్రీనివాసుని తొలి దర్శనం మాత్రం ఓ యాదవునికి దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఇతర ఆలయాలకు భిన్నంగా శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం తలుపులను ఆలయ పూజారులు తీయడానికి వీలులేదు. ఈ ద్వారం తలుపులను యాదవుడు తీయాల్సిందే. ఆ తర్వాతే రోజువారీ కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. ఈ ఆలయ తలుపులను యాదవుడు తీయడానికి శ్రీనివాసుని జీవిత చరిత్రలో ఒక కథ కూడా ఉంది.
వైకుంఠం వీడి భూలోకానికి వచ్చిన శ్రీవేంకటేశ్వరుడు లక్ష్మీదేవిని వెదకుతూ ఒక పుట్టలో తపోనిష్టుడవుతాడు. లక్ష్మీదేవి కోరిక మేరకు శ్రీనివాసుని ఆకలి తీర్చడానికి బ్రహ్మ, మహేశ్వరులు ఆవు, దూడలుగా మారి చోళ రాజు గోవుల మందలో చేరుతారు. ఆ ఆవు, దూడలను చూసి ముచ్చట పడిన చోళ రాణి... ఆ గోవు పాలు ప్రతిరోజు తనకిమ్మని పశువుల కాపరిని ఆజ్ఞాపిస్తుంది.
ప్రతి రోజూ ఇతర అవులతో కలిసి ఆ గోవు కూడా శేషాచల అడవికి మేతకు వెళ్లేది. తర్వాత మంద నుంచి తప్పించుకుని పుట్టలోని శ్రీనివాసుడి కోసం పాలు జారవిడిచేది. ప్రతిరోజూ ఇలానే జరుగుతూ వచ్చింది. ఇంటికి వెళ్లాక రాణి కోసం పాలు పితుకుదామంటే వచ్చేవి కావు. దీంతో పశువుల కాపరిపై రాణి కోపం తెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఆ ఆవుపై పశువుల కాపరి ప్రత్యేకంగా దృష్టి సారించాడు. ఆవుల మంద నుంచి ఆ ఆవు తప్పించుకుని వెళ్లి పుట్టలోని శ్రీహరికి పాలు జారవిడచడాన్ని పసిగట్టాడు. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన యాదవుడు తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును నరకబోయాడు.
ఇంతలో పుట్టలోని శ్రీనివాసుడు పైకి లేవడంతో ఆ దెబ్బ ఆయనకు తగిలి రక్తం దారలుగా ప్రవహిస్తుంది. ఈ దృశ్యం చూసిన యాదవుడు స్పృహ కోల్పోతాడు. ఆ దేవతా గోవు చోళ రాజును పుట్ట దగ్గరకు పిలుచుకురావడంతో ఆయన శరుణు కోరతాడు. స్పృహ వచ్చిన యాదవుడు తనను క్షమించమని శ్రీనివాసుడిని ప్రార్థిస్తాడు. భూలోకంలో తొలిసారిగా తనను దర్శించిన యాదవ వంశీయలకే తన తొలిదర్శనం లభిస్తుందని శ్రీనివాసుడు ఆ రోజున వరమిస్తాడు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆచారం సప్తగిరుల్లో పాటిస్తున్నారు.
ఆలయ ప్రధాన ద్వారం తలుపులను ప్రతి రోజూ బ్రహ్మముహుర్తమైన 2.30 గంటల సమయంలో అంటే సుప్రభాత సేవకు ముందు తెరుస్తారు. ఆ సమయంలో ఆలయ సన్నిధికి యాదవుడు శుచిగా స్నానమాచరించి తిరునామం ధరించి గోవింద నామాన్ని స్మరిస్తూ దివిటీ (పొంజు) చేతపట్టుకుని ఉత్తర మాడ వీధిలోని అర్చకుల ఇంటికి వెళ్లి భక్తి పూర్వకంగా నమస్కరించి ఆలయానికి ఆహ్వానిస్తాడు.
తర్వాత ఆలయం ఎదురుగా జీయంగార్ మఠానికి వెళ్లి జీయం గారు లేదా వారి ప్రతినిధి ఏకాంగిని ఆలయానికి ఆహ్వానిస్తాడు. జీయంగార్ సమక్షంలో గర్భగుడి తలుపులు తెరిచి దీపం వెలిగించి శ్రీవారిని దర్శించుకుంటారు. మొదటి తాంబూలం యాదవుడు తీసుకున్న తర్వాతే ఆలయంలో యథాప్రకారం రోజువారి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందుకే దేవదేవుని తొలి దర్శనం యాదవునికి దక్కిందని శ్రీనివాసుని చరిత్ర చెపుతోంది.