ఆధార్ ఉంటేనే క్షవరం.. ఆరోగ్య సేతు సేఫ్ అంటేనే లోనికి అనుమతి!!! ఎక్కడ?

మంగళవారం, 2 జూన్ 2020 (17:32 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు జనజీవితం పూర్తిగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి నిదర్శనమే తాజాగా.. క్షవరం చేయడానికి కూడా ఆధార్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై సెలూన్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ విధిగా తమ ఆధార్ కార్డుతో పాటు.. పేరు, మొబైల్ నంబరు వివరాలను సమర్పించాల్సివుంటుంది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. 
 
కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒక్కటి. ముఖ్యంగా, చెన్నై కరోనా కేంద్రంగా మారింది ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆధార్ కార్డును సెలూన్లకు కూడా వర్తింపజేస్తోంది. బ్యాంకు అకౌంట్లు, ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడే ఆధార్ కార్డు ఇప్పుడు క్షవరం చేయించుకునేందుకు కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇక సెలూన్ నిర్వాహకులు కూడా తప్పనిసరిగా ఓ రిజిస్టరులో కస్టమర్ల వివరాలు నమోదు చేయాలి. పేరు, ఫోన్ నెంబర్ మాత్రమే కాదు, ఆధార్ కార్డు వివరాలన్నీ ఆ రిజిస్టరులో పొందుపరచాలట. అంతేకాదు, సెలూన్ నిర్వాహకులు కస్టమర్ల ఫోనులో ఆరోగ్య సేతు యాప్ స్టేటస్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. 
 
ఫోనులో సేఫ్ అని చూపిస్తేనే క్షవరం చేయాలి. సెలూనులో ఏసీ నిలిపివేయాలి. కస్టమర్లు రాగానే శానిటైజ్ చేయాలి. మాస్కుల వాడకం తప్పనిసరి చేశారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు