ఉప ఎన్నికల ఫలితాలు : బీజేపీకి షాక్... ఆసక్తిగా మారిన ఫలితాలు

గురువారం, 31 మే 2018 (11:41 IST)
దేశవ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం చేపట్టారు. ఈ లెక్కింపు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ విజయంతో దూసుకెళ్తుండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కైరానాలో బీజేపీ అభ్యర్థి బాగా వెనుకబడివున్నారు.
 
నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఉపఎన్నిక జరుగగా, రెండింటిలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, రెండింటిలో విపక్ష పార్టీలు లీడ్‌లో ఉన్నాయి. అలాగే, 11 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా.. కాంగ్రెస్, మిత్రపక్షాలు సత్తా చాటుతున్నాయి. ఫలితాలు ఇటు అధికార, విపక్ష పార్టీల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. అసెంబ్లీ సీట్లలో బీజేపీ సత్తా చాటలేక పోయింది. 
 
నాలుగు పార్లమెంట్ స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాల కౌంటింగ్‌లో అందరి దృష్టి యూపీ రాష్ట్రం కైరానాపై పడింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ, ఆర్ఎల్డీ పోటీపడ్డాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించాలని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఆర్ఎల్డీకి మద్దతు పలికాయి. దీంతో కైరానాలో ఆర్ఎల్డీ అభ్యర్థి విజయపథంలో దూసుకెళుతున్నాడు. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం కావడం గమనార్హం. 
 
అలాగే, పాల్గరో లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి గోవిత్ దేద్య. మహారాష్ట్రలోని బాంద్రా- గోండియా పార్లమెంట్ స్థానంలో ఎన్సీపీ అభ్యర్థి, నాగాలాండ్‌లో బీజేపీ మిత్రపక్షం ఎన్డీపీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
ఇకపోతే, అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. కర్ణాటక ఆర్ ఆర్ నగర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీ దిశగా ఆధిక్యం కనబరుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నూర్పూర్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి, మహేస్తల - పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. కేరళలోని చెంగన్నూర్‌లో సీపీఎం అభ్యర్థి, షాకోట్ -పంజాబ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు, బీహార్‌లోని జోకిహట్ ఆర్జేడీ అభ్యర్థి, జార్ఖండ్‌లోని గోమియా, సిల్లిలో జేఎంఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు