దేశంలో శాంతి పరిరక్షణకు కట్టుబడివున్నాం : ప్రధాని నరేంద్ర మోడీ

గురువారం, 12 ఏప్రియల్ 2018 (13:12 IST)
దేశ ప్రజలను, భూభాగాన్ని కాపాడటానికి  ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నామో, దేశంలో శాంతి పరిరక్షణకు కూడా అంతే నిబద్ధతతో కట్టుబడివున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన గురువారం తమిళనాడు రాజధాని చెన్నైకు సమీపంలోని మహాబలిపురం తిరువిడందైలో జరుగుతున్న డిఫెన్స్‌ ఎక్స్‌పో-2018లో పాల్గొని ప్రసంగించారు.
 
దేశ ప్రజల రక్షణ, ప్రాదేశిక సమగ్రతకు తాము కట్టుబడి ఉన్నామని, అలాగే, శాంతికి కూడా అంతే బలంగా కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ఇందుకోసం వ్యూహాత్మక ఇండిపెండెంట్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏర్పాటుతో సహా మన సాయుధ బలగాలను సర్వసన్నద్ధం చేసేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామన్నారు. 
 
ముఖ్యంగా, మన సాయుధ బలగాలకు తగిన పరికరాలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టంచేశారు. స్వతంత్ర డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రక్షణ శాఖకు సంబంధించిన తయారీ అంశం ప్రభుత్వానికి చాలా ప్రత్యేకమైనదని మోడీ గుర్తుచేశారు. 
 
వర్తకం, విద్య ద్వారా చారిత్రక నాగరికతా సంబంధాలున్న చోళుల గడ్డపై ఇవాళ తాను అడగుపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. 500కు పైగా భారత కంపెనీలు, 150కి పైగా విదేశీ కంపెనీలు ఇక్కడకు రావడం ముదావహమని అన్నారు. వీటికి తోటు 40 దేశాలు తమ అధికార ప్రతినిధులను డిఫెన్స్ ఎక్స్‌పోకు హాజరుకావడం గొప్ప విషయమని అన్నారు. 
 
తమ అవసరాలను చేరుకునేందుకు 110 కొత్త యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రక్రియ ప్రారంభించామన్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో రెండు డిఫెన్స్‌ కారిడార్స్‌ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. నాలుగేళ్లలో తాము 1.3 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 794 ఎగుమతి‌ అనుమతులు ఇచ్చామన్నారు. ఎక్స్‌పోలో 500 భారతీయ కంపెనీలు, 150 విదేశీ కంపెనీలను చూడడం చాలా అద్భుతంగా ఉందని మోడీ అన్నారు. కాగా, ప్రధాని మోడీ గురువారం రోజంతా ఉపవాస దీక్షను పాటిస్తున్నప్పటికీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు