ముంబై మేయర్ రేసులో సోనూ సూద్.. మిలింద్ సోమన్?

మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:25 IST)
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2022లో జరగనుండగా వీటి విషయంలో... కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మేయర్ అభ్యర్థిని చాలా ముందుగానే ప్రకటించే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. 
 
కాంగ్రెస్ నుంచి రేసులో మాహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కొడుకు, నటుడు రితేష్ దేశ్‌ముఖ్,... మోడల్, ఫిట్‌నెస్ పర్సనాల్టీ మిలింద్ సోమన్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఉన్నట్లు తెలిసింది. ఈ ముగ్గురిలో ఒకరిని అభ్యర్థిగా ప్రటిస్తారని తెలుస్తోంది. 
 
కాంగ్రెస్ వ్యూహాత్మక డాక్యుమెంట్‌లో పేర్లు ఉన్న ఈ ముగ్గురూ కాంగ్రెస్ సభ్యులు కారు. సిటీ కాంగ్రెస్ కార్యదర్శి గణేశ్ యాదవ్... 25 పేజీల స్ట్రాటజీ డాక్యుమెంట్ డ్రాఫ్టును రూపొందించారు. దాన్ని ఇంకా పార్టీ నేతల ముందు ప్రవేశ పెట్టలేదు. కొన్ని రోజుల్లో మహారాష్ట్ర AICC సెక్రెటరీ ఇన్‌ఛార్జి హెచ్ కే పాటిల్ ముందు దీన్ని ప్రవేశ పెడతారని సమాచారం.
 
ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగ్తాప్... పార్టీ సీనియర్ నేతలతో ఈ డాక్యుమెంట్‌పై చర్చిస్తారని గణేశ్ యాదవ్ తెలిపారు. డాక్యుమెంట్ ప్రకారం... మేయర్ అభ్యర్థికి ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదని తెలిసింది. పైగా ఆ వ్యక్తికి... యువత నుంచి మంచి క్రేజ్, మద్దతు ఉండాలని తెలిసింది. ఈసారి ఎన్నికల్లో యంగ్ ప్రొఫెషనల్స్‌కీ, సోషల్ యాక్టివిస్టులకూ, స్టార్టప్ ఓనర్లకూ టికెట్లు ఇవ్వడం ద్వారా... ఇమేజ్ పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది.
 
అలాగే... మహారాష్ట్రలో మిత్రపక్షం శివ సేనతో కలిసి ఈ ఎన్నికల్లో పాల్గొంటుందా లేక... కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుందా అనేది స్పష్టమైన ప్రకటన రావాలని డాక్యుమెంట్‌లో కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు